మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా కృష్ణ మండల సరిహద్దులోని కర్నాటక రాష్ట్రం కాడేచూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర సరిహద్దులోని సీల్ ల్యాబోరేటరీస్ ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి రియాక్టర్ నుంచి గ్యాస్ లీక్ అయింది.
ఈ గ్యాస్ను ఐదుగురు కార్మికులు పీల్చగా, వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, నారాయణపేట జిల్లా కృష్ణ మండలం అలంపల్లి గ్రామానికి చెందిన గణేశ్(21), మధ్య ప్రదేశ్కు చెందిన విక్రమ్ సింగ్(36), నిరంజన్ సింగ్(30) ఊపిరాడక స్పాట్లోనే చనిపోయారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ అస్వస్థతకు గురికాగా, వారిని రాయచూర్ రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మృతి చెందిన గణేశ్ ఫ్యామిలీకి మద్దతుగా అలంపల్లి గ్రామస్తులు, వివిధ పార్టీల నేతలు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. గణేశ్ ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని బైఠాయించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.
కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ
గ్యాస్ లీకేజీ ఘటనపై ఎంపీ డీకే అరుణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. యాదగిరి కలెక్టర్, ఎస్పీలతో ఎంపీ ఫోన్లో మాట్లాడి అస్వస్థతకు గురైన ఇద్దరికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు యాజమాన్యం పరిహారం అందించాలన్నారు.
