- ఆయిల్పామ్ విస్తరణ, ధర, రైతుల సంక్షేమం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం : మంత్రి తుమ్మల
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : ఈ నెల 18న హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సమావేశంలో ఆయిల్ పాం విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, మద్దత ధర, రైతుల సంక్షేమంపై చర్చించి, సమస్యల పరిష్కారానికి కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివారం రైతులకు ఆయిల్పాం మొక్కలు పంపిణీ చేశారు.
అనంతరం కొత్తగా నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోందని, ఇది 70 లక్షల ఎకరాలకు పెరిగితేనే వంట నూనెల డిమాండ్ కు రీచ్ అవుతామన్నారు. తెలంగాణలో మూడు లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతోందని, మూడేండ్లలో 6 లక్షల ఎకరాల సాగుకు ప్లాన్చేశామన్నారు.
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్రాయల నాగేశ్వర రావు, ఆత్మ కమిటీ చైర్మన్సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్వైస్చైర్మన్జూపల్లి రమేశ్ బాబు, ఆయిల్ఫెడ్అధికారులు శ్రీకాంత్రెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
పనిచేయకుంటే అందర్నీ తీసేస్తా..
తల్లాడ, వెలుగు : రైతులను ఇబ్బంది పెడుతూ, పని విషయంలో నిర్లక్ష్యం చేస్తే అందరినీ తీసేస్తానని ఎన్ఎస్పీ ఆఫీసర్లను మంత్రి తుమ్మల హెచ్చరించారు. తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామానికి వచ్చిన మంత్రిని పలువురు రైతులు కలిసి, సాగునీరు అందని విషయాన్ని చెప్పారు. దీంతో మంత్రి ఎన్ఎస్పీ ఆఫీసర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్ఎస్పి ఆఫీసర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
