కాంగ్రెస్​లో చేరిన తీన్మార్​ మల్లన్న .. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ!

కాంగ్రెస్​లో చేరిన తీన్మార్​ మల్లన్న .. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ!

హైదరాబాద్, వెలుగు :  తీన్మార్​ మల్లన్న కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీప్​ సిప్పల్, ఏఐసీసీ ఇన్​చార్జి సెక్రటరీలు బోసు రాజు, పీసీ విష్ణునాథ్, రోహిత్​ చౌదరి, మన్సూర్​ అలీ ఖాన్ ​సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అంతేగాకుండా పార్టీ స్టార్​ క్యాంపెయినర్, ప్రచార కమిటీ కో కన్వీనర్​గా నియమిస్తామని హామీ ఇచ్చారని సమాచారం.

కాగా, మేడ్చల్​ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించిన తీన్మార్​ మల్లన్న.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మేడ్చల్​లో ​ పోటీ అంశంపై చాన్నాళ్లపాటు ఆయన కాంగ్రెస్​ పెద్దలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. నేరుగా పార్టీ నుంచి పోటీ చేయకుండా ఇండిపెండెంట్​గా బరిలోకి దిగితే.. తనకు సపోర్ట్​ ఇవ్వాల్సిందిగా మల్లన్న కోరినట్టు చెప్తున్నారు. గుజరాత్​లో ఎమ్మెల్యే జిగ్నేశ్​ మేవానీకి సపోర్ట్​ చేసినట్టుగా తనకూ మద్దతివ్వాలని కోరారని అంటున్నారు. అయితే, ఆ స్థానం నుంచి వజ్రేశ్​ యాదవ్​కు టికెట్​ కన్ఫర్మ్​ కావడంతో.. మల్లన్నతో పార్టీ నేతలు మరోసారి చర్చలు జరిపినట్టు సమాచారం. ఆ చర్చల్లోనే ఆయనకు ఎమ్మెల్సీ, స్టార్​ క్యాంపెయినర్, ప్రచార కమిటీ కో కన్వీనర్​ పదవులను ఇస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారని చెప్తున్నారు. 

మల్లన్న భార్యకు తుంగతుర్తి టికెట్?

తీన్మార్​ మల్లన్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా.. ఆయన భార్య మమతకు తుంగతుర్తి టికెట్​ ఇస్తారని ప్రచారం సాగుతున్నది. కాంగ్రెస్​ పార్టీ పెండింగ్​లో పెట్టిన నాలుగు స్థానాల్లో తుంగతుర్తి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానం నుంచి మల్లన్న భార్య పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆమె వివరాలనూ ఏఐసీసీ పెద్దలు తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఆ టికెట్​ కోసం అద్దంకి దయాకర్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అదే టికెట్​ కోసం మాజీ ఎంపీ నంది ఎల్లయ్య తమ్ముడి కొడుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తుంగతుర్తి టికెట్​పై ఆసక్తి నెలకొంది.