ఒడిశా రైలు ప్రమాదం వెనుక టీఎంసీ హస్తం : సువేందు అధికారి

ఒడిశా రైలు ప్రమాదం వెనుక టీఎంసీ  హస్తం :  సువేందు అధికారి

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.  

ఈ ఘటన మరో రాష్ట్రానికి చెందినప్పుడు ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారని టీఎంసీ నేతలను ఆయన ప్రశ్నించారు.  రైలు ప్రమాదంపై  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ చేపడితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 

ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను టీఎంసీ నేత కునాల్ ఘోష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విషయాన్ని అధికారి ప్రస్తావించారు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణ వీరికి ఎలా తెలిసింది?.. ఆ సంభాషణ ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. దీనిపై నిజనిజాలు సీబీఐ విచారణలో రావాలన్నారు. అవసరమైతే దీనిపై తాను కోర్టుకు కూడా  వెళ్తానన్నారు.  

ఒడిశా రైలు ప్రమాదంపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించాలన్న రైల్వే బోర్డు నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ కేసును కూడా సీబీఐకి ఇస్తే ఫలితం రాలేదన్నారు.  12 ఏళ్లు గడిచినా ఫలితం కనిపించడం లేదని చెప్పారు.