భారత జవాన్ను విడిచిపెట్టిన పాకిస్తాన్.. దర్జాగా మాతృభూమికి తిరిగొచ్చేశాడు

భారత జవాన్ను విడిచిపెట్టిన పాకిస్తాన్.. దర్జాగా మాతృభూమికి తిరిగొచ్చేశాడు

న్యూఢిల్లీ: ఏప్రిల్ 23, 2025 నుంచి పాకిస్తాన్ చెరలో ఉన్న భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు ఎట్టకేలకు భారత్కు అప్పగించారు. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్వయంగా ప్రకటించింది. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా క్షేమంగా భారత్కు తిరిగొచ్చాడు. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతర పరిణామాల సమయంలో ఫిరోజ్పూర్ బోర్డర్ దగ్గర 182వ బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా ప్రమాదవశాత్తూ బోర్డర్ దాటాడు.

పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను బంధించారు. ఆ సమయంలో పీకే సింగ్ బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి సర్వీస్ రైఫిల్తో ఉన్నారు. సరిహద్దు అవతల పొలం పనులు చేసుకుంటున్న రైతులకు తోడుగా ఉన్న పీకే సింగ్ ఒక చెట్టు కింద నీడలో కూర్చుని ఉండగా పాక్ రేంజర్లు ఆయనను బంధించారు. బీఎస్ఎఫ్ జవానును తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 23న సాయంత్రం జవానును పాక్ నిర్భంధించింది. 

Also Read : పాక్ నిజంగానే భారత రఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసిందా..?

పర్యాటకులే లక్ష్యంగా జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడిన సంగతి తెలిసిందే. ఆర్మీ యూనిఫాంలో వచ్చి, మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికినవాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ‘మినీ స్విట్జర్లాండ్​’.. కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఈ మారణహోమంలో 26 మంది ప్రాణాలు వదిలారు. మృతుల్లో పలువురు హనీమూన్​కు వచ్చిన దంపతులు ఉన్నారు. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దారుణానికి తామే పాల్పడ్డట్లు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ‘ది రెసిస్టెంట్​ ఫ్రంట్’ (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు సృష్టించిన ఈ నరమేధం ‘ఆపరేషన్ సిందూర్’కు ఆజ్యం పోసింది. భారత వైమానిక దళం ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఐఏఎఫ్ సంధించిన మిసైల్స్ ధాటికి వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.