రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదయిందని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో ఇవాళ విద్యుత్ డిమాండ్ నమోదు కావటం విశేషమన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట వరకు 14,794 మెగా వాట్ల విద్యుత్ నమోదయ్యిందని చెప్పారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు. గతేడాది మార్చిలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా..ఈ సారి డిసెంబర్ లోనే ఆ రికార్డ్ ను అధిగమించి 14,501 మెగా వాట్ల విద్యుత్ నమోదయ్యిందన్నారు. తాజాగా ఇవాళ మరోసారి (మంగళవారం) అత్యధికంగా 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగించడం గమనార్హం అన్నారు.
మొత్తం విద్యుత్ వినియోగంలో సౌత్ లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉందని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వాడుతున్నారని చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. డిమాండ్ ఎంత వచ్చినా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.