ముంబై: ఆసియా కప్లో గ్రూప్ దశలోనే ఓటమి.. టీ20 వరల్డ్కప్లో సెమీఫైనల్లోనే ఇంటిదారి. కొందరు స్టార్లను వెంటాడిన గాయాలు.. మరికొందరి నిరాశ. ఇలా 2022 ఇండియా టీమ్కు ఏమాత్రం కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో 2024లో సొంతగడ్డపై జరిగే టీ20 వరల్డ్కప్ టార్గెట్గా షార్ట్ ఫార్మాట్లో టీమిండియా కొత్త ఏడాదిలో, కొత్త రూపుతో, కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో సరికొత్త ప్రయాణం ఆరంభించనుంది. హార్దిక్ పాండ్యా ఫుల్ టైమ్ టీ20 కెప్టెన్గా నడిపిస్తాడని భావిస్తున్న టీమ్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ను దాటి తమ సత్తా నిరూపించుకోనుంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గతేడాది న్యూజిలాండ్లో టీ20 సిరీస్లో టీమ్ను గెలిపించిన హార్దిక్ విజన్ను ఇప్పటికే క్రికెట్ ఫాలోవర్స్ చూశారు. వన్డే వరల్డ్కప్ ఇయర్లో షార్ట్ ఫార్మాట్లకు ప్రయారిటీ లేకపోయినా ఈ సిరీస్.. నెక్స్ట్ ఇయర్ జరిగే టీ20 వరల్డ్కప్నకు ప్లానింగ్ చేసేందుకు హార్దిక్ కు ఉపయోగపడనుంది. ఇప్పటిదాకా వైట్ బాల్ క్రికెట్లో ఇండియా బ్యాటింగ్కు బ్యాక్బోన్ అయిన రోహిత్, కోహ్లీ, రాహుల్ ఈ సిరీస్లో బరిలోకి దిగడం లేదు. టీ20ల్లో వాళ్ల ఫ్యూచర్ ఎలా ఉన్నా ఈ త్రయాన్ని దాటి టీమ్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నిర్భయమైన క్రికెట్ను ఆడే ఉద్దేశం, సామర్థ్యం స్పష్టంగా లేకపోవడం ఇటీవలి కాలంలో ఇండియా టీ20 టీమ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. బాగా ఆడాలనే ఆలోచనతో ప్లేయర్లు వ్యక్తిగత పెర్ఫామెన్స్లపై ఫోకస్ పెట్టడం జట్టును దెబ్బతీస్తోంది. దీనివల్ల టీ20 వరల్డ్ కప్లో గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో అయినా మునుపటి ఆలోచనల నుంచి బయటపడి దూకుడుగా, నిర్భయంగా ఆడాలని హార్దిక్సేన భావిస్తోంది.
కాంబినేషన్ ఇట్ల..
న్యూజిలాండ్లో ఇషాన్ కిషన్తో కలిసి ఓపెనింగ్ చేసిన రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్కు గురయ్యాడు. తను ఎలాగూ టీమ్లో లేకపోవడంతో తొలి పోరులో ఇషాన్, రుతురాజ్ ఇన్నింగ్స్ ఆరంభించే చాన్సుంది. ఐపీఎల్లో ఈ ఇద్దరూ ఓపెనర్లుగా అదరగొట్టారు. టీమ్లో చోటు కోసం బెంగ లేకుండా తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఈ ఇద్దరికి ఇదే మంచి చాన్స్. టీ20 వరల్డ్కప్నకు 18 నెలలకు పైగా సమయం ఉండటంతో టీ20ల్లో ఈ ఇద్దరికీ తగినన్ని చాన్స్లు లభిస్తాయి. ఇంకా ఇంటర్నేషనల్ టీ20 ఆడని శుభ్మన్ గిల్ రూపంలో హార్దిక్కు మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. మూడో నంబర్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్పై భారీ అంచనాలున్నాయి. ఇక, ఆరుగురు బౌలర్ల ఆప్షన్తో బరిలోకి దిగాలని హార్దిక్ భావిస్తుండగా.. దీపక్ హుడా తుది జట్టులోకి ప్లేస్ ఖాయం కానుంది. మిడిలార్డర్లో సంజు శాంసన్, అన్క్యాప్డ్ రాహుల్ త్రిపాఠిలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంది. త్రిపాఠి కొన్నాళ్లుగా బెంచ్పైనే ఉంటున్నాడు. అదే టైమ్లో అనుభవం ఉన్న శాంసన్కు తగిన చాన్స్లు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్ననేపథ్యంలో హార్దిక్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. బౌలింగ్లో అన్ క్యాప్డ్ ప్లేయర్లు శివం మావి, ముకేష్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ తొలి మ్యాచ్లో అర్ష్దీప్, హర్షల్, ఉమ్రాన్ బరిలోకి దిగొచ్చు. కెప్టెన్ పాండ్యాకు తోడు సుందర్, అక్షర్, హుడా రూపంలో ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నా స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ తుదిజట్టులో ఉంటాడు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: ఇషాన్ (కీపర్), రుతురాజ్, సూర్యకుమార్, శాంసన్, హార్దిక్ (కెప్టెన్), హుడా, సుందర్, హర్షల్, అర్ష్దీప్, ఉమ్రాన్, చహల్.
శ్రీలంక: నిశాంక, కుశాల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, అసలంక, రాజపక్స, షనక (కెప్టెన్), హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్, మదుశంక, లహిరు కుమార.
లంక ఏం చేస్తుందో..
కొన్నేళ్లుగా వరుస వైఫల్యాల తర్వాత గతేడాది ఆసియాకప్లో గెలిచిన శ్రీలంక ఆత్మవిశ్వాసం పెంచుకుంది. అయితే టీ 20 వరల్డ్కప్లో అదే జోరు కొనసాగించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇండియా మాదిరి లంక కూడా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించాలని చూస్తోంది. తమ దేశంలాంటి వాతావరణం ఉండే ఇండియాలో సత్తా చాటాలని ఆశిస్తోంది. లంక ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన అవిష్క ఫెర్నాండో, చమిక కరుణరత్నే, సమరవిక్రమను ఈ టూర్కు ఎంపిక చేసి వాళ్ల పెర్ఫామెన్స్ను గుర్తించింది. ఫెర్నాండో, కరుణరత్నే ఇద్దరూ టీమ్లో రీఎంట్రీ ఇచ్చారు. ఇండియాపై రాణించాలని చూస్తున్నారు. మిడిలార్డర్లో భానుక రాజపక్స కీలక బ్యాటర్ కానున్నాడు.