రైతు సమస్యలపై కేసీఆర్‎కు రేవంత్ బహిరంగ లేఖ

రైతు సమస్యలపై కేసీఆర్‎కు రేవంత్ బహిరంగ లేఖ

రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‎కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

‘రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యల నేపథ్యంలో రైతులు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితి నన్ను ఎంతగానో కలచివేసింది. ఇటీవల నేను మహబూబాబాద్ ప్రాంతంలో పర్యటించి వచ్చి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశాను. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవాలి. 

ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి నివేదికలు సమర్పించాయి. రైతులకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుంది. దాంతో ప్రతీ రైతుకు 6 నుంచి 12 లక్షల వరకు అప్పు ఉంది. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. ఆత్మహత్య  చేసుకున్న రైతు కుటుంబాల అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలోని పిల్లలను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలి. కౌలు రైతులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలి. కల్తీ, నకిలీ పురుగు మందుల నివారణకు తగిన పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి. రైతు వేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలి’ అని ఎంపీ రేవంత్ రెడ్డి తన లేఖలో కోరారు.