బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు : రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు :  రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై  జరుగుతున్న ఐటీ దాడులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు.  నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదని రేవంత్ నిలదీశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ ,  కేసీఆర్  బెంబేలెత్తుతున్నారని విమర్శించారు.  ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇదని ఆరోపించారు.  ఈ దాడులను తాను  తీవ్రంగా ఖండిస్తున్నానన్న రేవంత్ ...   2023 నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమని తెలిపారు.  

పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై  ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.  8 వాహనాల్లో వచ్చిన అధికారులు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌,  ఖమ్మంలోని ఆయన ఇళ్లు, ఆఫీసులపై  ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.  పొంగులేటి సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇండ్లల్లో బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు సోదాలు జరిపారు. ఖమ్మం రూరల్​ మండలం శ్రీసిటీ, అర్బన్​లోని గొల్లగూడెంలో గల తుమ్మల నివాసాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీ విజిల్ యాప్ లో అందిన ఫిర్యాదు మేరకే తనిఖీలు చేశామని వారు తెలిపారు.