- హరీష్ రావువి కూడా తప్పుడు మాటలే
- వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలె
- పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్
హైదరాబాద్: కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తున్నదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. ఇవాళ గాంధీభవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ మేడిగడ్డ టూర్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక సైతం ఇతర బ్లాక్ లకు ప్రమాదం ఉందని చెప్పిందని గుర్తు చేశారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీలు ఇదే పద్దతిలో కట్టారని, వాటికి ప్రమాద ఉండొచ్చు అని నివేదిక ఇచ్చిందన్నారు.
మేడిగడ్డకు తొందరగా రిపేర్స్ చేయాలని కేటీఆర్ కోరుతున్నారన్నారు. 1.65 కిలో మీటర్లు బ్యారేజి ఉంటే 50 మీటర్లు దెబ్బతిన్నదని నిన్నటి పర్యటనలో ఒప్పుకున్నారని ఆయన తెలిపారు.హరీశ్ రావు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అపర మేథావి అని టోపీ పెట్టుకొని ఎన్నోసార్లు బ్యారేజి దగ్గరకి వెళ్లారని ఎద్దేవా చేశారు. సబ్ కాంట్రాక్టర్లు ఎవరూ లేరని ఎల్ అండ్ టీ వాళ్లే నిర్మాణం చేపట్టారని రికార్డ్స్ చెప్తున్నాయన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణా ప్రజలను మోసం చేసిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు.