మూసాపేట నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జాం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు

మూసాపేట నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జాం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు

బీహెచ్ఈఎల్ టూ ఖైరతాబాద్ రూటులో కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఎటూ కదలలేని పరిస్థితుల్లో గంటల తరబడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ సిటీలో పడుతున్న భారీ వర్షానికి.. మూసాపేట మెట్రో స్టేషన్ కింద.. భారీగా వరద నీళ్లు నిలిచాయి. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. కార్లు వెళ్లాలన్నా సగం మునిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించింది.

మూసాపేట నుంచి అమీర్ పేట వరకు.. అదే విధంగా కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి కూకట్ పల్లి వరకు మొత్తం ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. రోడ్లపై వరద తగ్గితేకానీ కదిలే పరిస్థితి లేదు. సెప్టెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 30 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు వాహనాలు ముందుకు కదలటం లేదు. దీంతో అటూ, ఇటు వైపు నాలుగు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. 

వరద తగ్గిన తర్వాత ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావాలంటే కనీసం మూడు, నాలుగు గంటల సమయం అయినా పట్టే అవకాశం ఉంది.  

భారీ వర్షానికి బేగంపేట నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో పుల్ ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూకట్ పల్లి బస్ డిపో ముందు వరద నీరు చేరడంతో అమీర్పేట్ నుంచి కూకట్ పల్లి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ట్రాఫిక్  జామ్ అయింది. మినిస్టర్ రోడ్డు, టోలీచౌకీ, భరత్ నగర్ ఫ్లైఓవర్ మొత్తం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

వరద నీటి ప్రభావంతో మైత్రివనం నుంచి మూసాపేట్ వెళ్లే రహదారిని ట్రాఫిక్ అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో వాహనాలను ట్రాఫిక్ అధికారులు దారి మళ్లిస్తున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ నగర్ నుంచి మూసాపేట, కూకట్ పల్లి నుంచి మైత్రివనం వెళ్లే  రోడ్లను దారి మళ్లిస్తున్నారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షం కారణంగా ముంబై ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరుకుంది. మూసాపేట్ నుండి మియాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. 

అటు మాదాపూర్ నుంచి దుర్గం చెరువు వెళ్ళే రూట్ లో వరద నీరు భారీగా నిలిచిపోయింది. రోడ్డుపై నీరు చేరడంతో ఐటీ క్యారిడార్ వైపు ప్రయాణాలు కష్టంగా మారాయి. మాదాపూర్ లోని పత్రిక నగర్, గఫూర్ నగర్ ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. 

దీంతో పలు కాలనీలకు రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిషేధించారు. మైండ్ స్పేస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.