న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ స్పష్ట చేశారు.
ట్రాఫిక్ డైవర్షన్స్
ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్బండ్ మీదుగా వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. లిబర్టీ కూడలి, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేయనున్నారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై డిసెంబర్ 31 రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు.