తెలంగాణ ప్రభుత్వం హరిత హారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తుంటే పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో చెట్లను నరికి వేస్తున్నారు. సుమారు 30 ఏండ్లకు పై పడ్డ భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారుల బృందం ఏసీపీ కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించారు. భారీ వృక్షానికి సంబంధించిన చెట్టు కొమ్మలు విరిగి పడుతుండడంతో వాటిని తొలగించాలని ఆదేశించామని చెప్పారు. కానీ కింది స్థాయి సిబ్బంది మరోలా అర్థం చేసుకొని చెట్లను పూర్తిగా తొలగించి ఉండవచ్చునని ఏసీపీ పొంతన లేని సమాధానం చెప్పడంతో అటవీ అధికారులు విస్మయానికి గురయ్యారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం కేసు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.