దేశంలోని పలువురు ప్రముఖులపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే కర్ణాటక సీఎం యెడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోగా.. అతనికి నెగటివ్ అని తేలింది. కానీ అతని కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలడంతో సీఎం.. హోం క్వారంటైన్లో ఉన్నారు.
ఈ విషయమై సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ అని వచ్చిందని.. ఏదేమైనా, రాబోయే ఏడు రోజులు హోం క్వారంటైన్ లో ఉంటూ.. కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తానని చెప్పారు. ఈ ఏడు రోజులు ఇంటి నుండి పని చేస్తానని చెప్పారు. తన బాగు కోసం ప్రార్థించిన త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, తప్పకుండా గెలుస్తామని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేవ్ తన తల్లి మినా, భార్య నీతి మరియు వారి ఇద్దరు పిల్లలతో అగర్తాలాలోని తన అధికారిక నివాసంలో ఉంటున్నాడు.