చిన్నారిపై అత్యాచారం చేసిన TRSలీడర్ రాధారపు శంకర్ సస్పెండ్ అయ్యాడు.ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ లో ఆరేళ్ల గిరిజన చిన్నారిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో శంకర్ ను పార్టీ నుంచి,రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని తెలిపారు.
ఆల్మాస్ పూర్ ఘటన పై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు బస్వరాజు సారయ్య. ఘటనకు బాధ్యుడైన వ్యక్తి పై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బొట్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆదేశాలతో బాధ్యుడైన రాధరపు శంకర్ ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నామన్నారు. కలెక్టర్, పోలీస్ అధికారులను కలిసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అంతేకాదు చిన్నారి కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
బాధాకరమైన ఈ సంఘటనను ప్రతి పక్షాలు రాజకీయం చేయడం సరికాదన్నారు జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ.చిన్నారి పై ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వ పరంగా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన గిరిజన దంపతులు ఆరేండ్ల పాపతో కలిసి ఉద్యోగరీత్యా ఎల్లారెడ్డిపేట మండలంలోని టీఆర్ఎస్ లీడర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అయిన శంకర్ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. శంకర్ మండల స్థాయి లీడర్ కాగా, ఆయన భార్య ఆ ఊరి సర్పంచి. ఈ నెల 27న పాప తల్లిదండ్రులిద్దరూ డ్యూటీలకు వెళ్లారు. ఇంట్లో టీవీ లేకపోవడంతో చిన్నారి శంకర్ ఇంట్లో చూసేందుకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి శంకర్ పాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.