
India US Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలల కిందట ప్రపంచ దేశాలపై ప్రకటించిన ట్రేడ్ టారిఫ్స్ వ్యాపారాలతో పాటు ఆర్థిక వ్యవస్థలను అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటి అమలుకు 90 రోజులు బ్రేక్ ప్రకటించిన ట్రంప్ స్వల్ప ఊరటం ఇచ్చారు. అయితే ఈ గడువు జూలై 9న ముగుస్తుండటంతో మరోసారి గడువును పొడిగించే ఆలోచన తనకు లేదని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పటం కొంత ఆందోళలను పెంచుతోంది.
ప్రస్తుతం ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న భారత ట్రేడ్ చర్చల బృందం వాషింగ్టన్ నగరంలో తమ పర్యటనను పొడించుకుంటోంది. వీలైనంత త్వరగా చర్చలను ముగించాలని, గడువుకు మునుపే వాటిని కొలిక్కి తీసుకురావాలని వారు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా అమెరికా ఇండియా అధికారుల మధ్య జూన్ 27 నుంచి చర్చలు జరిగాయి. ఈ క్రమంలో త్వరలోనే ఈ ప్రక్రియ ముగింపుకు చేరుకోవచ్చని సమాచారం.
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు 26 శాతం పరస్పర సుంకం నుంచి పూర్తి మినహాయింపు అందించాలని ఇప్పటికే ఇండియా కోరుతోంది. సుంకాన్ని 90 రోజుల పాటు నిలిపివేసినప్పటికీ, వాషింగ్టన్ విధించిన 10 శాతం బేస్లైన్ సుంకం అమలులోనే ఉంది. జూలై 8 నాటికి చర్చలు ముగియకపోతే, భారతదేశం కొత్త సుంకాల ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ట్రేడ్ టారిఫ్స్ అమలు బ్రేక్ పొడిగించే ఆలోచన తనకు లేదనటం ఆందోళనలు పెంచుతోంది. అలా చేయాల్సిన అవసరం లేదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.
రాబోయే సుంకాల గురించి దేశాలకు తెలియజేసే లేఖలు "త్వరలో" ప్రారంభం అవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే మరో పక్క భారతదేశ వ్యవసాయ మార్కెట్ను జన్యుపరంగా మార్పు చేసిన పంటలకు అనుమతివ్వాలన్న వాషింగ్టన్ ఒత్తిడితో సహా కీలకమైన అమెరికా డిమాండ్లను భారతదేశం వ్యతిరేకిస్తూనే ఉంది. రైతులు నష్టాల్లో ఉన్నట్లు భారత్ వాదిస్తోంది. అయితే వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఇంధనం వంటి రంగాలను తెరవాలని, సోయా, గోధుమ, మొక్కజొన్న, ఇథనాల్, ఆపిల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా భారతదేశాన్ని కోరుతోంది. ఇదే సమయంలో భారత్ టెక్స్ టైల్, ఫార్మా, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో జీరో డ్యూటీలను డిమాండ్ చేస్తోంది.