
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్ )రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఆర్సీ ఏర్పాటు చేసి రెండేండ్లు పూర్తయినా ఇంతవరకు రిపోర్టును ప్రభుత్వం విడుదల చేయలేదని, దాని వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే వేతన సవరణ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలన్నారు.
నూతన విద్యాసంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల టైటిల్స్ పాఠ్యపుస్తకాలను వెంటనే అందించాలని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని,పెండింగ్బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణభారతి, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఎన్.నాగేశ్వరరావు, బి.ఆడం, వెలుగు రమేశ్, ఎస్ సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.