
నల్గొండ అర్బన్, వెలుగు : విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘం ఆఫీస్ బ్యానర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొంతమంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ డిప్యూటేషన్లతో వెళ్తున్నారనిన తెలిపారు. పీఏపల్లి, అడవిదేవులపల్లి, చండూరు, గుడిపల్లి లాంటి మండలాల నుంచి హైవే ప్రాంతాలైన కట్టంగూరు, నకిరేకల్, కేతపల్లి మండలాలకు అక్రమంగా డిప్యూటేషన్ పై కొందరు వచ్చారని చెప్పారు.
ఈ అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు జి.నాగమణి, పెరుమాళ్ల వెంకటేశం, బి.అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, వడిత్య రాజు, ఎడ్ల సైదులు, సీహెచ్ అరుణ, సీహెచ్ రామలింగయ్య, గేర నరసింహ, ఎం.శ్రీనివాసరెడ్డి, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు