
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. బుధవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. డివిజన్ బెంచ్ తీర్పుపై చర్చించిన కమిషన్ సభ్యులు.. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు అభ్యర్థులు వేసిన కేసు ద్వారా లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకూ ఏ ఎగ్జామ్ కూ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదని, గ్రూప్1 ప్రిలిమ్స్ కు మాత్రం ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినట్టు కమిషన్ అధికారులు చెప్తున్నారు.
ముందుగా జరిగిన పరీక్షలో కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు రావడం వల్లే రెండోసారి పెట్టిన పరీక్షకు బయోమెట్రిక్ నిర్వహించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హాల్ టికెట్ లోనూ వెల్లడించామన్నారు. అయితే, హైకోర్టు జడ్జిమెంట్ కాపీ అందకపోవడంతో పాటు ఇద్దరు కమిషన్ సభ్యులు మీటింగుకు హాజరుకాకపోవడంతో శుక్రవారం పూర్తి స్థాయి కమిషన్ భేటీ కానుంది. చర్చల అనంతరం తీర్పుపై ఏం చేయాలో నిర్ణయం తీసుకోనున్నారు. మెజార్టీ అభ్యర్థులకు భరోసా కోసం న్యాయపోరాటం కొనసాగించేలా ముందుకు పోవాలని భావిస్తున్నారు.