563 పోస్టులతో గ్రూప్ 1 .. కొత్త నోటిఫికేషన్ రిలీజ్​.. పాతది రద్దు

563 పోస్టులతో గ్రూప్ 1 .. కొత్త నోటిఫికేషన్ రిలీజ్​.. పాతది రద్దు
  • ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు
  • వయోపరిమితి రెండేండ్లు పెంపు..  
  • యూనిఫామ్ సర్వీసెస్​ పోస్టులకూ వర్తింపు
  • అత్యధికంగా ఎంపీడీవో పోస్టులు 140, డీఎస్పీ పోస్టులు 115
  • మే లేదా జూన్ లో ప్రిలిమ్స్​.. సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో మెయిన్స్​
  • 1:50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్​కు ఎంపిక 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​ 1 నోటిఫికేషన్​ను టీఎస్​పీఎస్సీ రిలీజ్​ చేసింది. కొత్తగా 60 పోస్టులు కలుపుతూ మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్​ ఇచ్చింది. పాత (2022 నాటి) నోటిఫికేషన్​ను రద్దు చేసి.. గంటలోనే కొత్తదాన్ని  విడుదల చేసింది. సోమవారం సాయంత్రం టీఎస్​పీఎస్సీ కమిటీ సమావేశం జరిగింది. 503 పోస్టుల భర్తీకి రెండేండ్ల కింద ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరిన్ని పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్  విడుదల చేశారు. గ్రూప్​ 1 దరఖాస్తుదారుల వయోపరిమితిని ప్రభుత్వం రెండేండ్లకు పెంచింది. ఇది యూనిఫామ్​ సర్వీసెస్​ పోస్టులకు కూడా వర్తిస్తుందని తాజాగా జీవో ఇచ్చింది. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాల భర్తీలో స్థానికులకే 95% పోస్టులను కేటాయించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. 

పాతోళ్లకు నో ఫీజ్​

ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​పీఎస్సీ సైట్​లో ఆన్​ లైన్​ ద్వారా అప్లయ్​ చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్​కు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడు అప్లయ్​ చేసుకోవాలని, అయితే.. వాళ్లు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. 

కొత్త వారికి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 ఉంటుందని వెల్లడించింది. నిరుద్యోగులకు ఎగ్జామినేషన్​ ఫీజు (రూ.120) నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలోనే రీఅప్లై , ఫ్రెష్ అనే వాటిని ఎంచుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి అదే నెల  27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది. 

మే లేదా జూన్ లో ప్రిలిమ్స్​

గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ లో నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ తెలిపింది. త్వరలోనే ఎగ్జామ్ డేట్​ను ప్రకటిస్తామని పేర్కొంది. ఆఫ్ లైన్​ పద్ధతిలో 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రం కోసం పది జిల్లాలకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆధారంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాతే మెయిన్ ఎగ్జామ్ డేట్లను రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. మెయిన్ ఎగ్జామ్ గ్రేటర్ హైదరాబాద్​ (హెచ్​ఎండీఏ పరిధి)లో లేదా ఇతర జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్1 ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్​లో నిర్వహించనుండగా.. మెయిన్స్​కు మాత్రం రాత పరీక్ష ఉంటుంది.  

సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకొని..

తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత అప్పట్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం గ్రూప్​ 1న నోటిఫికేషన్​ ఇచ్చింది. 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 2022 అక్టోబర్ 11న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగ్గా.. 2.85 లక్షల మంది అటెండ్ అయ్యారు. ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా ఇచ్చారు. 1:50 రేషియోలో 25 వేల మందిని మెయిన్స్​కు ఎంపిక చేశారు. అయితే, పేపర్ లీక్ కావడంతో గ్రూప్​ 1ను రద్దు చేశారు. ఆ తర్వాత జూన్ 11న రెండో సారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టగా.. 2.33 లక్షల మంది రాశారు. ఈ పరీక్ష రిజల్ట్ కూడా ఇచ్చారు. అయితే, ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహణలో లోపాలున్నాయనే కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. ఇట్ల రెండు సార్లు రద్దయింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టును టీఎస్​పీఎస్సీ ఆశ్రయించింది. కాగా, సుప్రీంకోర్టులో వేసిన కేసును టీఎస్​పీఎస్సీ సోమవారం వెనక్కి తీసుకున్నది. దీంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి.. 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

ఓపెన్ మెరిట్ ఆధారంగా 1: 50 ద్వారా మెయిన్స్​కు..

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్​కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంట్లో 563 పోస్టులకు గానూ 1:50 రేషియోలో మెరిట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అయితే, గతంలో 2022 నోటిఫికేషన్​లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కేటగిరి, రిజర్వేషన్ల ఆధారంగా 1:50 రేషియోలో మెయిన్స్​కు ఎంపిక చేశారు. దీనిద్వారా మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతుందనే వాదనలతో టీఎస్​పీఎస్సీ కొత్తగా ఓపెన్​ మెరిట్​ ఆధారంగా మెయిన్స్​కు పిలవాలని నిర్ణయం తీసుకున్నది. 

మల్టీజోన్​ 1లో 258.. మల్టీజోన్​ 2లో 305

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్​ 1 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనుండగా.. దీంట్లో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులున్నాయి. పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులు 140 ఉండగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పోస్టులు 115  ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (డీటీడబ్ల్యూవో) పోస్టులు  రెండు మాత్రమే ఉన్నాయి.. అవి కూడా మల్టీ జోన్ 2లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/ డిస్ట్రిక్ట్​ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్​మెంట్ ఆఫీసర్ పోస్టులు మూడు ఉన్నాయి. 

గ్రూప్1 నోటిఫికేషన్ వివరాలు... 

పోస్టులు:    563 (మల్టీజోన్ 1: 258,
    మల్టీజోన్ 2: 305)
దరఖాస్తులు:    ఫిబ్రవరి 23 నుంచి
    మార్చి 14 వరకు
ఎడిట్ ఆప్షన్:    మార్చి 23  నుంచి  27 వరకు
ప్రిలిమినరీ ఎగ్జామ్:    మే/జూన్, 2024 
మెయిన్ ఎగ్జామ్:    సెప్టెంబర్ /అక్టోబర్, 2024 

కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు...

కేటగిరీ    పోస్టులు 
ఓసీ (ఓపెన్​ కేటగిరీ)     209 
ఈడబ్ల్యూఎస్      49 
బీసీ–ఏ     44 
బీసీ–బీ     37 
బీసీ–సీ     13 
బీసీ–డీ    22 
బీసీ–ఈ     16 
ఎస్​సీ     93 
ఎస్టీ     52  
పీహెచ్​     24 
స్పోర్ట్స్     4 
ప్రతి కేటగిరీలో హారిజంటల్​
విధానంలో మహిళలకు
33 శాతం రిజర్వేషన్ల అమలు