- నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డులు కైవసం
- ఈనెల 15న ఢిల్లీలో ప్రదానం
- రవాణా మంత్రి పొన్నం, సంస్థ ఎండీ సజ్జనార్ హర్షం
హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డులు సంస్థను వరించాయి. 2022-–23 సంవత్సరానికి రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరిల్లో ఈ పురస్కారాలు దక్కాయి. రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో రెండో బహుమతిని ఆర్టీసీ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు మరో ఫస్ట్ ప్రైజ్ ను సంస్థ గెలుచుకుంది.
ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈనెల 15న సంస్థ ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. కాగా, టీఎస్ ఆర్టీసీ 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని ఆయన అన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డులను గెలుచుకోవడంతో ప్రజా రవాణా వ్యవస్థలో టీఎస్ ఆర్టీసీ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని సంస్థ ఎండీ, వీసీ సజ్జనార్ చెప్పారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.