వైద్య రంగంలో తెలంగాణ ఆదర్శం..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​​ రావు

వైద్య రంగంలో తెలంగాణ ఆదర్శం..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్​​ రావు

అచ్చంపేట, వెలుగు: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని  ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి హరీశ్​ రావు అన్నారు.   మంగళవారం అచ్చంపేటలో రూ.20 కోట్ల నిధులతో నిర్మించిన 100 బెడ్ల హాస్పిటల్ ను ప్రారంభించారు. అనంతరం డబుల్​ బెడ్​ రూం ఇండ్లను ప్రభుత్వ విప్​ గువ్వల బాల్​రాజ్​, ఎంపీ రాములుతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 

Also Read : ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో  5 మెడికల్​ కాలేజీలు,  ప్రతి నియోజక వర్గానికి 100 బెడ్ల​ హాస్పిటల్,  ఐసీయూ కేంద్రాన్ని​ ఏర్పాటు చేశామన్నారు.  బడ్జెట్లో వైద్య రంగానికి రూ. 3వేల కోట్లను కేసీఆర్ కేటాయించారన్నారు.  అంతకు ముందు అచ్చంపేట మున్సిపల్​ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన, మినీ స్టేడియాన్ని ప్రారంభించడంతో పాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అచ్చంపేటలో నిర్మించిన 150 డబుల్​ బెడ్​ రూం ఇండ్లను పారదర్శకంగా అధికారులు లక్కీ డీప్​ ద్వారా ఎంపిక చేశామన్నారు. 

 కలెక్టర్​పై మంత్రి అసహనం 

డబుల్​ బెడ్ రూం ఇండ్ల పంపిణీ సమయంలో అధికారులు అందుబాటులో లేక పోవడంతో కలెక్టర్ పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  కలెక్టర్​ ఉదయ్​ కుమార్,  టీఎస్​ఎంఐడీసీ ఛైర్మెన్​ ఎర్రోళ్ల శ్రీనువాస్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శాంత కుమారి, వైస్​చైర్మెన్​ బాలాజీ సింగ్​, మున్సిపల్ చైర్మెన్​ నర్సింహ్మ గౌడ్​, మార్కెట్​ చైర్ పర్సన్​అరుణ,  ఎంపీపీలు, జడ్పీటీసీలు,  అధికారులు పాల్గొన్నారు. 

  పాలమూరు పచ్చ బడ్డది

 -బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చ బడ్డదని మంత్రి హరీశ్​రావు అన్నారు. మంగళవారం సాయంత్రం అచ్చంపేటలో  జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.  అచ్చంపేట ప్రాంతానికి మూడు ప్రాజెక్టులు, ఒక లిఫ్ట్​ ఇరిగేషన్​ను సాధించిన ఘనత గువ్వల బాల్​రాజ్​, ఎంపీ రాములులకు దక్కిందన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ  మద్ది మడుగు సమీపంలోని కృష్ణా నదిపై వంతెన నిర్మించాలని కోరారు. అనంతరం బాల్​రాజ్​ మాట్లాడుతూ నల్లమల ప్రాంత రైతుల పాదాలు కృష్ణమ్మనీల్లతో తడపడమే తన లక్ష్యమని అన్నారు 

 బీఆర్ఎస్ పాలనతో గ్రామాల అభివృద్ధి

అమ్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో మారు మూల గ్రామాల అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మన్ననూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కొందరు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్మన్ శాంతకుమారి,  కలెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.