తునీషాకు తుది వీడ్కోలు

తునీషాకు తుది వీడ్కోలు

ముంబై: ఆత్మహత్య చేసుకున్న టీవీ యాక్టర్ తునీషా శర్మ అంత్యక్రియలు మంగళవారం ముంబైలోని మీరా రోడ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆమెకు తుది వీడ్కోలు పలికేందుకు సినీ ఇండస్ట్రీ సభ్యులు, యాక్టర్లు, స్నేహితులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు షీజాన్ ఖాన్ తల్లి, సోదరిలు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో తునీషా తల్లి స్పృహతప్పి కిందపడిపోయారు. అయితే, తునీషా డెడ్​బాడీని జేజే ఆస్పత్రి నుంచి సోమవారం రాత్రి భీమ్‌‌‌‌‌‌‌‌సేన్ జోషి ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చినట్లు తునీషా మామ తెలిపారు. ఆమె మృతదేహాన్ని చూడగానే తునీషా తల్లి అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.

కన్నీళ్లు పెట్టుకున్న షీజాన్ ఖాన్

రెండ్రోజులుగా పోలీస్​ కస్టడీలో ఉన్న నిందితుడు షీజన్ ఖాన్.. తునీషాతో బ్రేకప్​కు రకరకాల కారణాలు చెప్తున్నాడని పోలీసులు తెలిపారు. మొదటగా తునీషా తనకంటే వయసులో పెద్దదని, మరోసారి మతాలు వేరు కాబట్టి దూరంగా ఉండాలనుకున్నా అని, ఇంకోసారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఆమెకు దూరమయినట్లు స్టేట్​మెంట్లు ఇచ్చాడని తెలిపారు. షీజన్​ను మంగళవారం ఓ మహిళా పోలీస్​ ఆఫీసర్​ విచారిస్తుండగా.. తునీషా అంత్యక్రియలు విషయం తెలిసి తొలిసారి ఎమోషనల్ అయ్యాడని, కన్నీళ్లు పెట్టుకున్నాడని వివరించారు. తునీషా, షీజన్‌‌‌‌ల మొబైల్‌‌‌‌ ఫోన్ల డేటాను తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కాగా, తునీషాను మహారాష్ట్ర నైగావ్‌‌‌‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సీసీటీవీ ఫుటేజీ మంగళవారం బయటపడింది. స్పృహ లేకుండా ఉన్న తునీషాను ఓ వ్యక్తి ఎత్తుకుని మెట్లమీది నుంచి వేగంగా ఆస్పత్రిలోకి తీసుకెళ్తుండడం వీడియోలో కనిపించింది. పక్కనే షీజన్ ఖాన్​తో పాటు మరో మహిళ ఉన్నారు. షూటింగ్ సెట్​లో తునీషా ఉరేసుకుని కనిపించగానే కిందకు దించి అక్కడున్నోళ్లే ఆమెను తీసుకువచ్చారని ఆస్పత్రి డాక్టర్ సురేంద్ర పాల్ చెప్పారు. ఆమె అప్పటికే చనిపోయిందన్నారు.