హైదరాబాద్ లో ఇద్దరు ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లర్ల అరెస్ట్.. 20 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ లో  ఇద్దరు ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లర్ల అరెస్ట్.. 20 కిలోల గంజాయి స్వాధీనం

మలక్ పేట, వెలుగు: దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్ బస్టాప్ వద్ద ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్​చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 20 కిలోల గంజాయి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సంబంధిత వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేశ్​బంధం, నిర్మల్ ఛత్రియా స్నేహితులు. వీరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. 

ఈ క్రమంలో ఒడిశాకే చెందిన గంజాయి సప్లయర్​ఆనంద్ ఠాకూరా అలియాస్ డేవిడ్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌‌‌‌కు గంజాయిని చేరవేస్తే ప్రయాణ, వసతి ఖర్చులతోపాటు ఒక్కో ట్రిప్పునకు రూ.10 వేల చొప్పున ఇస్తానని డేవిడ్ వారికి ఆశ చూపడంతో ఒప్పుకున్నారు. తర్వాత ఒడిశాలోని మల్కన్‌‌‌‌గిరి జిల్లా నుంచి 20 కిలోల గంజాయితో రైలు, బస్సు మార్గాల ద్వారా గురువారం హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నారు. ఇక్కడున్న గౌతమ్ అనే వ్యక్తికి గంజాయిని అప్పగించడానికి దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్ బస్టాప్ వద్ద వేచి ఉండగా.. సికింద్రాబాద్​టాస్క్‌‌‌‌ఫోర్స్, మలక్‌‌‌‌పేట్ పోలీసులు పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. బ్యాగుల్లో చూడగా.. 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 4 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఇద్దరినీ అరెస్ట్​చేశామని, ఆనంద్ ఠాకూర్ అలియాస్ డేవిడ్, గౌతమ్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

గంజాయి, గంజాయి ట్యాబ్లెట్స్​స్వాధీనం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లిలో గురువారం గంజాయి, గంజాయి ట్యాబ్లెట్లు విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్​డీ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 200 గ్రాములున్న 8 గంజాయి కెన్నాబిస్​ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

నిజాంపేట రోడ్డులోని విజేత సూపర్​మార్కెట్​సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడు గురు సుమంత్ ను పట్టుకొని కూకట్​పల్లి ఎక్సైజ్​పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇతను ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన సాయి కృష్ణంరాజు నుంచి గంజాయి కొనుగోలు చేసి, తీసుకువచ్చినట్లు నిర్ధారించామని, అతనిపైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.