
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో ఇటీవల రూ.కోటి విలువైన డ్రగ్స్ను విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు వల పన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ పరారీలో ఉన్నారని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ ముఠాలో తిరుపతికి చెందిన మరో కానిస్టేబుల్ కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
డ్రగ్స్ సరఫరాలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తిరుపతికి చెందిన టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటు మరో హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను కూడా కూకట్పల్లి పోలీసులు తిరుపతిలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకువస్తున్నట్లు సమాచారం.
ఈ ఇద్దరితో పాటు డ్రగ్స్ విక్రయం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువైన ఎపిడ్రిన్, హెరాయిన్ డ్రగ్స్ను కలిపి విక్రయించటం సాధారణమైన విషయం కాదని, దీని వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.