కిరాణ షాపుకు వెళ్లి వచ్చేలోపే.. ఇద్దరు మైనర్ అక్కా చెల్లళ్లు ఆత్మహత్య.. బాలాపూర్లో విషాద ఘటన

కిరాణ షాపుకు వెళ్లి వచ్చేలోపే.. ఇద్దరు మైనర్ అక్కా చెల్లళ్లు ఆత్మహత్య.. బాలాపూర్లో విషాద ఘటన

ఎల్బీనగర్, వెలుగు:  హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బాలాపూర్ పరిధిలో శనివారం (జూన్ 21) విషాదకర ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్, శుభోదయ నగర్ కాలనీలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన మద్దిశెట్టి వెంకటేశ్, రమణమ్మ దంపతులకు ఇంటర్ సెకండియర్ చదువుతున్న కూతురు వెన్నెల (17), పదవ తరగతి పూర్తి చేసిన అఖిల (15) ఉన్నారు. 

వెంకటేశ్ బెంగళూరులో  తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి హైదరాబాద్‌‌కు బదిలీ అయ్యాడు. దాంతో తన కుటుంబంతోపాటు నెల క్రితం హైదరాబాద్‌‌కు వచ్చాడు. వీరంతా శుభోదయ నగర్‌‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, శనివారం వెంకటేశ్ డ్యూటీకి వెళ్లగా.. రమణమ్మ డిష్ వాషింగ్ లిక్విడ్ కోసం కిరాణా షాపుకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో వెన్నెల, అఖిల ఇద్దరూ కిటికీ గ్రిల్స్‌‌కు చున్నీతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు. 

రమణమ్మ వెంటనే స్థానికుల సహాయంతో చున్నీని కత్తిరించి కిందకు దించినప్పటికీ ఇద్దరు బాలికలు  అప్పటికే చనిపోయారు. ఒకేసారి తమకున్న ఇద్దరు కూతుళ్లూ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

బాలికలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ జానకిరెడ్డి, సీఐ సుధాకర్ పరిశీలించారు. ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలను లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.