శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 4) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. భారత దళాల కాల్పుల్లో ఇద్దరు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు.
ఉధంపూర్ జిల్లాలోని మజల్టా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సైన్యానికి సమాచారం అందింది. వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో సైన్యం రాకను గమనించిన ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.
వెంటనే అప్రమత్తమైన సైనికులు కౌంటర్ ఫైరింగ్ జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రమూకలు హతమయ్యారు. మృతులను పాకిస్తాన్ ఉగ్రవాదులు జబ్బర్, మావిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.
