జీడిమెట్ల, వెలుగు: ఈత సరదా ఇద్దరు స్కూల్ విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో జరిగింది. ఎల్లమ్మబండ, ఎన్టీఆర్ నగర్కి చెందిన నవాజ్ (16) ఒపెన్ టెన్త్, అయాన్ (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. హైదర్ (16) ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఈత నేర్చుకోవడం కోసం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు దేవేందర్ నగర్ వెళ్లారు.
అక్కడున్న క్వారీ గుంతలోని నీటిలో దిగారు. ఈత రాకున్నా నవాజ్, అయాన్ గుంతలో మరింత ముందుకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. వారు ఎంతకీ బయటకు రాకపోవడంతో హైదర్ భయంతో ఇంటికి వచ్చి స్థానికులకు విషయం చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్వారీ గుంతలోంచి ఇద్దరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నవాజ్, అయాన్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.