
కోదాడ, వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. ఆదివారం కోదాడలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ఓరుగంటి ప్రభాకర్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబుకు రెండు కళ్ల లాంటివాని పేర్కొన్నారు. తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేయరని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని, కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి ముత్తినేని సైదేశ్వర రావు, కోదాడ నియోజకవర్గ పరిశీలకుడు నాతాల రామిరెడ్డి, భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ కృష్ణమాచారి, కోదాడ పట్టణ అధ్యక్షుడు జనపనేని కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.