వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను పారిస్ యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి. శర్మ ఆదివారం సందర్శించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఆలయ పరిరక్షణ చర్యలను సమీక్షించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు ఆయన చైర్మన్గా వ్యవహరించిన తొలి భారతీయుడు కావడం విశేషం. ఇటీవల ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్కు కూడా అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కో ఐసీహెచ్ జాబితాలో చేర్చింది. విశాల్ వి. శర్మ సారథ్యంలోనే 2021లో రామప్ప టెంపుల్ యునెస్కో జాబితాలోకి ఎక్కింది. ఇన్కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు.
ఆయన వెంట ఏఎస్ఐ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు హెచ్ఆర్ దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ శ్రీ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు రోహిణి పాండే- అంబేద్కర్, ఇన్కోయిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ నాగోజీరావు తదితరులు ఉన్నారు.
