ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే?
  • రాష్ట్ర సర్కారుకు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న
  • బనకచర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలే 
  • రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాకే సమస్యను పరిష్కరిస్తం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోం
  • రాజాసింగ్​అంత అనుభవం తనకు లేదంటూ సెటైర్​
  • ఆయుధాలు వీడి చర్చలకు రావాలని మావోయిస్టులకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‎పై కాంగ్రెస్ గతంలో సుద్దపూసలా మాట్లాడిందని, కానీ ప్రస్తుతం ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరడం లేదని అడిగారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‎పై తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పజెప్పేలా కోర్టు తీర్పు ఇస్తుందనే నమ్మకం తమకున్నదని తెలిపారు.

సంప్రదింపులు జరిపాకే నిర్ణయం

బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్​రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల నడుమ  నీటి పంపకాలు, వరద జలాల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తప్పకుండా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి సమాచార మార్పిడి జరగలేదని చెప్పారు.

 ఇద్దరు సీఎంలు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విషయంలో, రాష్ట్రానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాయాలని సీఎం రేవంత్‌‌ను డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో లేఖ రాయడంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ద్వారా ఏపీ సీఎంను తెలంగాణ సీఎం పిలిచి మాట్లాడేలా చొరవ తీసుకోవాలని సూచించారు.  కాళేశ్వరం అంశంపై బీజేపీ ఎప్పుడూ ఒక్క మాట మీదే ఉందని, దీనిపై తాము మొదటి నుంచీ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ ​చేస్తున్నామని చెప్పారు.  

స్థానిక ఎన్నికలపై నిర్ణయం సంతోషకరం 

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం సంతోషకరమని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీకి దిగుతామని  తెలిపారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. డిజిటల్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కాగా, మావోయిస్టులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.  రాజకీయంగా ఎమ్మెల్యే రాజాసింగ్​కు చాలా అనుభవం ఉన్నదని, తాము సాధారణ కార్యకర్తలమని, రాజాసింగ్ లాంటి వ్యక్తి మాట్లాడితే వింటామంటూ కిషన్​రెడ్డి సెటైర్​ వేశారు.