జనాలకు అన్యాయం జరిగిందని భావించినా.. కొన్ని సంస్థల వల్ల ఇబ్బంది పడ్డా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఇక ఆ తరువాత నిరసనల బాట పడతారు. ఈ నిరసనలు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. ధర్నాలు, ర్యాలీలు, బంద్ లు ఇలా అనేక రూపాల్లో తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలుపుతారు. కాని తాజాగా మహారాష్ట్ర హింగోలి వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. హింగోలిలో రైతులకు నకిలీ మందులు విక్రయిస్తున్నారని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అబ్దుల్ సత్తార్పై, వ్యవసాయ శాఖపై నగదు విసిరి ప్రత్యేక నిరసన తెలిపారు. పురుగు మందుల కంపెనీలు, మరికొన్ని సంస్థలు నాశిరకం మందులు అందిస్తున్నాయని ఆందోళన చేపట్టారు. ఆ కంపెనీల నుంచి అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి లంచాలు తీసుకొని తమకు ద్రోహం చేస్తున్నారంటూ... వారి ఎదుట గాలిలోకి డబ్బుల నోట్లను విసిరారు.
మంత్రికి వ్యతిరేకంగా నిరసన
ఓ పురుగుమందుల కంపెనీతో పాటు మరో ఏడు కంపెనీలు రైతులకు తప్పుడు మందులను విక్రయించాయని ఆందోళనకారులు పేర్కొన్నారు. కంపెనీలు విక్రయిస్తున్న మందులపై స్థానిక రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నదాతలు వాపోయారు. . దీనికి నిరసనగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు వ్యవసాయ మంత్రికి వ్యతిరేకంగా ప్రత్యేక నిరసనలకు దిగారు. హింగోలి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వారు నోట్లు విసిరి నిరసన తెలిపారు. నకిలీ, నాశిరకం మందులు అమ్మిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/namrata_INDIATV/status/1660602398472286208