- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
లక్నో: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. సెలూన్లు కూడా మూసేయడంతో మగవారు, చిన్నపిల్లలకు జుట్టు, గడ్డం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కొంత మందైతే సెలూన్లు ఓపెన్ చేయించండి అని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. యూపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సతీశ్ ద్వివేదీకి కూడా అవే కష్టాలు వచ్చాయి. తన కూతురు, కొడుకుకి జుట్టు బాగా పెరిగిపోయి చిరాకుగా ఉన్నారని.. ఆయన స్వయంగా కత్తెర చేతపట్టుకుని వారికి కట్టింగ్ చేశారు. ఆయన కటింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీసిన మంత్రి భార్య దాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. “ నేనే వాళ్లకు కటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. నాలుగున్నరేళ్ల కూతురు సుకృతికి సరిగా చేయలేకపోయాను. నా కొడుకుకి చేసేటప్పటికి అలవాటు అయిపోయింది. కానీ అదేమీ ఈజీ కాదు. కటింగ్ చేయడంలో బిజీగా ఉంటే నా భార్య నాకు తెలీకుండా వీడియో తీసింది ” అని మంత్రి అన్నారు. కటింగ్ ఎలా ఉన్నా జుట్టుతో ఇప్పుడు చిరాకు లేదని పిల్లలు అన్నారని చెప్పారు.