
హైదరాబాద్: పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ లో సేవాదల్ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తమ్. అనంతరం ఆయనతో సమావేశమైన డీసీసీ అధ్యక్షులతో మాట్లాడుతూ…డీసీసీ అధ్యక్షులు చాలా కష్టపడి పని చేస్తున్నారని, వారి పనితీరు చాలా బాగుందన్నారు. కరోనా సమయంలో ప్రజలకు, వలస కార్మికులకు ఎంతో సేవ చేశారని, డీసీసీ లలో కొందరికి అన్యాయం జరిగినా కూడా పార్టీ కోసం సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు.
ప్రభుత్వ పాలన గురించి ఎండగడుతూ.. కరోనా వ్యాధితో చనిపోయిన వారిని ఇతర రోగాలతో చనిపోయారని చెబుతూ అధికార పార్టీ నాయకులు అబద్దాలు ఆడుతున్నారన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడానికి ప్ర భుత్వానికి ఉన్న సమస్య ఏమిటని ప్రశ్నించారు. శ్రీశైలంలో జల విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
కృష్ణ జలాలను కాపాడుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమైన రోజున కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కాకుండా ఆంధ్రకు వత్తాసు పలుకుతున్నారని, తెలంగాణ కు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా… చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు.