
- కాళేశ్వరం.. దేశంలోనే చెత్త ప్రాజెక్ట్
- కేటీఆర్ కలల్లో బతుకుతున్నరు.. వాస్తవంలోకి రావాలి
- బీఆర్ఎస్ పాలన అంతా విధ్వంసకరమే..
- బీజేపీ గ్రౌండ్లో లేదు.. మీడియాలోనే ఉన్నదని మంత్రి విమర్శ
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ ఇంకా కొనసాగుతున్నదని, రిపోర్ట్ రావాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘‘నాకు తెలిసిన సమాచారం మేరకు.. మేడిగడ్డ ప్రాజెక్ట్ను చాలా నిర్లక్ష్యంగా కట్టిన్రు. అందుకే దారుణంగా దెబ్బతిన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్కు మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిది. కానీ.. ఆ బ్యారేజీ కట్టేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. టూరిజం కోసమని బస్సులు పెట్టి మరీ తీసుకుపోయిన్రు. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ గప్పాలు కొట్టిన్రు..’’అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దేశంలో అత్యంత చెత్త ప్రాజెక్ట్ ఏదైనా ఉందా.. అంటే అది కాళేశ్వరమే అని విమర్శించారు. గురువారం గాంధీభవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే ఖరారు అవుతాయి. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే వరకు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాం’’అని ఉత్తమ్ అన్నారు.
బీఆర్ఎస్ విధ్వంసం భయంకరంగా ఉంది
బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం చాలా భయంకరంగా ఉందని ఉత్తమ్ విమర్శించారు. క్రిమినల్ మనస్తత్వం, ఇంత అవినీతి మరకలతో ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. ‘‘మొదటి రోజే ఎలక్ట్రిసిటీపై రివ్యూ చేస్తే రూ.90 వేల కోట్ల అప్పు తేలింది. రెండో రోజు ఇరిగేషన్పై రివ్యూ చేస్తే రూ.2 లక్షల కోట్లు తేలింది. ప్రజలను తాకట్టుపెట్టి తీసుకొచ్చిన సొమ్ముతో కాళేశ్వరం కట్టినా.. ఆయకట్టు పెరిగిందేమీ లేదు. మూడో రోజు సివిల్ సప్లైస్ మీద రివ్యూ చేస్తే రూ.58 వేల కోట్ల అప్పు తేలింది. ఇలా ఏ శాఖ తీసుకున్నా అన్నీ అప్పుల కుప్పగా మారినయ్..’’అని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ను ప్రజలే తిరస్కరించిన్రు
కేటీఆర్ కలల్లో బతుకుతున్నాడని, ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్ ఉనికి కూడా కష్టమే అని విమర్శించారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటెందుకు వేయాలని ప్రజలు భావిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీతోనే పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గ్రౌండ్లో లేదని, కేవలం మీడియాలోనే ఉందని ఎద్దేవా చేశారు.