బీటెక్ యువతి మృతికి కారకుడైన నిందితుడి ఎన్​కౌంటర్

బీటెక్ యువతి మృతికి కారకుడైన నిందితుడి ఎన్​కౌంటర్

లక్నో: మొబైల్ ఫోన్ చోరీ చేసి, బీటెక్ విద్యార్థిని మృతికి కారకుడైన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఎన్​కౌంటర్ చేశారు. ఘజియాబాద్​లోని మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్​పాయింట్ వద్ద పోలీసులు వెహికల్స్ తనిఖీ చేస్తుండగా బైక్​మీద వస్తున్న ఇద్దరిని ఆపారు. అయితే, వాళ్లు బైక్ వదిలి పరిగెత్తడంతో పాటు, పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుల్లో ఒకరికి బులెట్ తగిలి పడిపోయాడు. మరొకతను తప్పించుకున్నాడు. బులెట్ గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయాడు. మృతుడిని బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్(19) మరణానికి కారకుడైన నిందితుల్లో ఒకరైన జితేంద్రగా పోలీసులు గుర్తించారు. 

అసలేం జరిగిందంటే.. 

జితేంద్ర మరొకరితో కలిసి ఈ నెల 27న ఘజియాబాద్​లో ఆటోలో వెళ్తున్న బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్ నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ యువతి ప్రతిఘటించడంతో నిందితులు ఆమె చేయి పట్టుకుని కిందకు లాగారు. అలాగే ఆమెను 15 మీటర్ల వరకు రోడ్డుపై గుంజుకెళ్లి, ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి.. ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరగడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ మసూరి ఏరియా సీఐపై సస్పెన్షన్ వేటు పడగా, ఇద్దరు సబ్​ఇన్​స్పెక్టర్లను పోలీస్ లైన్స్ కు అటాచ్ చేశారు. సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో జితేంద్ర చనిపోయాడు. ఇతడిపై ఇదివరకు 12 కేసులున్నాయని, పరారీలో ఉన్న మరో నిందితుడిపై 25 వేల రివార్డును ప్రకటించామని పోలీసులు తెలిపారు.