ఉత్తరాఖండ్‌లో 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవి : సేఫ్ ఆడిట్

ఉత్తరాఖండ్‌లో 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవి : సేఫ్ ఆడిట్

ఉత్తరాఖండ్ లో దాదాపు 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవిగా తేలింది. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఉన్న మొత్తం 3262 బ్రిడ్జిలుండగా అందులో 2618 బ్రిడ్జిలపై అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. అందులో 36 వంతెనలు మాత్రం సురక్షితంగా లేవని గుర్తించారు. సకాలంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని అధికారులు తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించామన్నారు.

పాత, శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున మూడు వారాల వ్యవధిలో ఆడిట్ నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన నేపథ్యంలో నవంబర్ 3న జారీ చేసిన సీఎం ఆదేశాల మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) సేఫ్టీ ఆడిట్ నిర్వహించింది. అక్టోబరు 30న గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 141 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.