న్యూఢిల్లీ: పోర్చుగల్ నుంచి భారత్ చేరడానికి వాస్కోడిగామాకు 11 నెలలు మాత్రమే పట్టిందని.. కానీ, హింసతో అట్టుడికిన మణిపూర్కు వెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం రెండేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్ అగ్నిజ్వాలల్లో కాలిపోతున్నప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు. రెండు వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో 200 మందికి పైగా మరణించారని, 70 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
