మీ ఆదరణతో మూడేండ్ల ‘వెలుగు’

మీ ఆదరణతో మూడేండ్ల ‘వెలుగు’

మన రాష్ట్రం.. మన ప్రజల బాగోగులే ఎజెండాగా పుట్టిన ‘వెలుగు’ దినపత్రిక మరో మైలురాయిని దాటింది. మూడేండ్ల కింద తెలుగు మీడియాలో కొత్తదనంతో మీ ముందుకొచ్చిన ‘వెలుగు’ మీ ఆదరణతోనే ఇవ్వాళ విజయవంతంగా నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నది. జనం జీవితానికి, సమస్యలకు పెద్దపీట వేస్తూ మన భాష, చరిత్ర, సంస్కృతి 
సంప్రదాయాలకు అద్దం పడుతున్నది ‘వెలుగు’. జనానికి అక్కరకొచ్చే సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నది. తెలంగాణ ఆకాంక్షలు, ప్రజా ప్రయోజనాలే పాలసీగా కథనాలను అందిస్తున్నది. సర్కారు పగబట్టినా, ప్రకటనలు ఆపేసినా జనం వాయిస్​కు వేదికగా నిలబడడమే ‘వెలుగు’ దినపత్రిక ఎంచుకున్న తొవ్వ. అనుక్షణం మన ఉద్యమ ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నది. నీళ్లను కాపాడుకునేందుకు రాజీలేకుండా నిజాలను మీ ముందు ఉంచుతున్నది. మిగులు రాష్ట్రం అప్పులపాలవుతున్న లెక్కను, లక్షలాదిమంది నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్న తీరును వెలుగులోకి తెస్తున్నది. పత్రికలో, టీవీలో వస్తేనో.. కోర్టు చెబితేనో.. ఎన్నికలు ఉంటేనో తప్ప కదలిక లేని స్థితిలో ఉన్న పాలనలో జనం కోరుకున్న ప్రతిపక్ష పాత్రను ‘వెలుగు’ నిస్సందేహంగా నిలబెట్టుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి V6 న్యూస్ చానెల్​ను ఆదరించినట్లుగానే.. తర్వాత వచ్చిన ‘వెలుగు’ దినపత్రికను కూడా గుండెల్లో పెట్టుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు. మీరు అందిస్తున్న ప్రోత్సాహం.. సహకారం.. ఆశీస్సులతోనే ‘వెలుగు’ ముందుకు సాగుతోంది. ఆదరిస్తున్న పాఠకులకు, ప్రకటనకర్తలకు, సహకారం  అందిస్తున్న ఏజెంట్లు, హాకర్లకు ‘వెలుగు’ కుటుంబం తరఫున  కృతజ్ఞతలు. జనం మాట.. జనం బాటకే కట్టుబడి ఉంటామని మరోసారి మాట ఇస్తున్నం.                                                                                                                                                                                ‑ అంకం రవి , చీఫ్‌ ఎడిటర్‌