న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే వినాయక చవితి పూజలు నిర్వహిస్తున్నారు. దేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కూడా ఈ పర్వదినాన్ని సతీసమేతంగా పూజలు నిర్వహించారు. తమ నివాసంలో మట్టి గణపతి ప్రతిమకు పూజ చేశారు.
ఈ సందర్భంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రసాదించాలని, కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో దేశాభివృద్ధికి ఎదురౌతున్న విఘ్నాలను తొలగించాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించినట్లు తెలిపారు.
అంతకుముందు దేశ ప్రజలందరికి వెంకయ్య.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. “ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, ఆ గణాధిపతి ఆశీస్సులతో ఆటంకాలు తొలగిపోయి, ప్రజలంతా తమ తమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.