
హైదరాబాద్: ప్రజలందరూ కలసి పోరాడితేనే కరోనాపై విజయం సాధించగలమని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. అందరూ లాక్డౌన్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాచకొండ కమిషనరేట్ ఏరియాలో ఆత్మహత్యలు, బైక్ గ్యాంగ్, లాక్డౌన్ అమలు లాంటి పలు విషయాలపై మహేశ్ భగవత్ మాట్లాడారు. సరూర్ నగర్ లేక్ ఔట్ పోస్ట్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తున్నారని.. ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి యత్నించిన ఆరుగురిని కాపాడామన్నారు.
క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలనుకునే వారిని అలాంటి ఆలోచనల నుంచి బయటపడేయడానికి సైకాలజీ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. 040 48214800 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 52 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు.
‘రాచకొండ కమిషనరేట్ పరిధిలో మే 12 నుంచి ఇప్పటివరకు 56,466 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ రూల్స్ను అతిక్రమించిన వారిపై 41,990 కేసులు నమోదు చేశాం. 11,638 మందిపై మాస్క్ ధరించనందుకు కేసులు నమోదు చేశాం. గ్యాదరింగ్ అయినందుకు గానూ 601, సోషల్ డిస్టన్స్ పాటించనందకు 1,823 మందిపై కేసులు పెట్టాం. మొత్తంగా 13,490 వాహనాల్ని సీజ్ చేశాం. బాలాపూర్లో బైక్ గ్యాంగ్లో నలుగురిని అరెస్ట్ చేశాం. రిస్క్ టేకర్స్కు 30 చోట్ల వ్యాక్సినేషన్ చేస్తున్నాం. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం’ అని భగవత్ పేర్కొన్నారు.