విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్లో ఇది 12వ చిత్రం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. స్పై థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతోంది. తాజాగా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లాడు విజయ్. విశాఖపట్నం ఎయిర్పోర్టులో ప్లకార్డులతో అతనికి ఘన స్వాగతం పలికారు అభిమానులు. అంతేకాకుండా విజయ్ స్టే చేసిన హోటల్ వరకూ బైక్స్ ర్యాలీ నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్గా భాగ్యశ్రీ బోర్సే, మమతాబైజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనున్న రూరల్ యాక్షన్ మూవీకి ఇటీవల సైన్ చేశాడు విజయ్. ఈనెల 9న విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.