జగన్ ను చూసైనా కేసీఆర్ మారాలి: విజయశాంతి

జగన్ ను చూసైనా కేసీఆర్ మారాలి: విజయశాంతి

సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి . కేబినెట్ లో మహిళలకు స్థానంపై స్పందిస్తూ కొత్తగా సీఎం అయిన జగన్ ను  చూసైనా కేసీఆర్ మహిళలకు కేబినెట్ లో స్థానం కల్పించాలని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో పెట్టిన శ్రద్ధ రాష్ట్రంలోని సమస్యలపైన పెట్టడం లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లయినా సమస్యలు అలానే ఉన్నాయన్నారు. రెండవ సారి అధికారంలోకి వచ్చినా  మహిళలకు కేబినెట్ లో అవకాశమివ్వకపోవడం కేసీఆర్ కు మహిళలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందన్నారు.  ఏపీలో జగన్ మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవులివ్వడం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని..దీనిని చూసైనా కేసీఆర్ మహిళలకు కేబినెట్ లో స్థానం కల్పిస్తారా? లేదా మరో ఐదేళ్లు అలాగే నడిపిస్తారా? అనే సందేహం వస్తుందన్నారు.

ఏపీ కేబినెట్ లో ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పిస్తే బాగుండేదని అన్నారు విజయశాంతి. సినీ నటులను ప్రచారానికే పరిమితం చేయకుండా వారికి తగిన గుర్తింపునిస్తే బాగుండేదని అన్నారు. రాబోయే రోజుల్లోనైనా రోజా విషయంలో జగన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు విజయశాంతి.