లండన్:‘కీలకమైన నాలుగో నంబర్లో అంబటి రాయుడును ఎందుకు సెలెక్ట్ చేయలేదు? తుది జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు ఎందుకు? సెమీస్లో ధోనీని ఏడో నంబర్లో పంపించాల్సిన అవసరం ఏముంది?’ వరల్డ్కప్ సెమీఫైనల్లో పరాజయం తర్వాత స్వదేశానికి వచ్చిన వెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రికి బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) నుంచి ఎదురయ్యే ప్రశ్నలివి. జట్టుతో పాటు వీరిద్దరూ స్వదేశానికి వచ్చిన తర్వాత వరల్డ్కప్ పెర్ఫామెన్స్పై సీఓఏ రివ్యూ చేయనుంది. అలాగే, ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్ను దృష్టిలో ఉంచుకొని తీసుకొనే నిర్ణయాలపై సెలెక్షన్ కమిటీతో సీఓఏ హెడ్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గె చర్చించనున్నారు. వరల్డ్కప్ రివ్యూ మీటింగ్ జరిగే తేదీ, సమయం ఇంకా ఖరారు కాలేదని రాయ్ తెలిపారు.
టీమ్ సెలెక్షన్ విషయంలోనే కెప్టెన్, కోచ్, సెలెక్షన్ కమిటీకి సీవోఏ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఎదురవనున్నాయి. ముఖ్యంగా అంబటి రాయుడును జట్టులోకి ఎందుకు తీసుకోలేదని సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో హోమ్ సిరీస్ వరకూ కొనసాగించిన అంబటిని కీలకమైన నాలుగో నంబర్లో వరల్డ్కప్కు సెలెక్ట్ చేయకపోవడం, స్టాండ్ బై లిస్ట్లో ఉన్నప్పటికీ ఇద్దరు ప్లేయర్లు గాయంతో తప్పుకున్న తర్వాత కూడా అతనికి చాన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో టీమ్ మేనేజ్మెంట్ను అడగనుంది. అలాగే, కొన్ని మ్యాచ్ల్లో తుది జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది?, పైగా వన్డేల్లో చాన్నాళ్ల నుంచి పెద్దగా రాణించని, ఐపీఎల్లోనూ పేలవంగా ఆడిన దినేశ్ కార్తీక్కు ఎందుకు చాన్సిచ్చారు? అని కోహ్లీ, శాస్త్రిని సీఓఏ ప్రశ్నించొచ్చు. సెమీఫైనల్లో ధోనీ బ్యాటింగ్ పొజిషన్ కూడా చర్చకురానుంది. 240 రన్స్ ఛేజింగ్లో టాపార్డర్ వైఫల్యంతో 5/3తో జట్టు కష్టాల్లో పడినప్పటికీ సీనియర్ ప్లేయర్ ధోనీని చాలా ఆలస్యంగా ఏడో నంబర్లో ఎందుకు ఆడించారని మేనేజ్మెంట్ను ప్రశ్నించనుంది. ధోనీ ఏ నంబర్లో ఆడాలో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై సీవోఏ.. హెడ్ కోచ్ శాస్త్రి వివరణ కోరొచ్చు.
14న స్వదేశానికి కోహ్లీసేన
ఇండియా క్రికెట్ టీమ్ ఈనెల 14న స్వదేశానికి బయల్దేరనుంది. ‘సెమీస్లో ఓటమి తర్వాత ఆటగాళ్లంతా నిరాశలో ఉన్నారు. వాళ్లంతా శనివారం లండన్లో కలుస్తారు. 14వ తేదీ సాయంత్రం అంతా ఒకేసారి అక్కడి నుంచి ముంబైకి బయల్దేరుతార’ని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు

