- ఐదో బౌలరా..ఎక్స్ట్రా బ్యాట్స్మనా!
- తొలి టెస్ట్ కాంబినేషన్పై కోహ్లీ డైలమా
- రోహిత్, రహానె మధ్య పోటీ
ఓవైపు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్’ ఒత్తిడి.. మరోవైపు ఏడున్నర నెలల తర్వాత ఐదు రోజుల ఫార్మాట్లో ఆడబోతున్న టీమిండియా..! ఈ నేపథ్యంలో కరీబియన్ గడ్డపై విరాట్సేన తొలి టెస్ట్కు సిద్ధమైంది…! కానీ టీమ్ కాంబినేషన్పైనే ఎటూ తేల్చుకోలేకపోతున్నది..! టెస్ట్ ప్లేయర్లు అందుబాటులోకి వచ్చినా.. వాళ్లను ఏయే స్థానాల్లో ఆడించాలన్న దానిపై డైలమా కొనసాగుతున్నది..! దీంతో బౌన్సీ పిచ్లపై విండీస్ను దీటుగా ఎదుర్కోవాలంటే ఎక్స్ట్రా బ్యాట్స్మన్ను తీసుకోవాలా? ఐదో బౌలర్ను ఆడించాలా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది..!!
అంటిగ్వా: పర్ఫెక్ట్ టెస్ట్ ప్లేయర్గా ముద్రపడ్డ రహానె.. వరల్డ్కప్లో పరుగుల వరద పారించి సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్.. మధ్యలో కేఎల్ రాహుల్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్… వీళ్లలో నుంచి ఫస్ట్ టెస్ట్లో ఎవరెవర్ని ఆడించాలి? ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్, టీమ్ మేనేజ్మెంట్ ముందున్న సవాలు ఇది. విండీస్ పిచ్లపై ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అమలు చేయాల్సి వస్తే ఎవర్ని బెంచ్కు పరిమితం చేయాలనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. వాస్తవానికి శిఖర్ ధవన్ గైర్హాజరీతో ఇప్పుడు ఓపెనింగ్తోనే అసలు సమస్య మొదలైంది. సంప్రాదాయంగా వస్తున్న పాత వ్యూహాలను అమలు చేయాలనుకుంటే రాహుల్, మయాంక్తో ఇన్నింగ్స్ను ప్రారంభించొచ్చు. కానీ ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్లకు రాహుల్ను పిలిపించి పక్కనబెట్టడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో విహారిని ఓపెనర్గా పంపించినా పెద్దగా స్కోరు చేయలేదు. అయినా బంతి పాతబడే వరకు ఆడి మయాంక్, పుజారాకు మంచి సాయం చేశాడు. కాబట్టి రాహుల్, విహారిలో ఎవరు ఓపెనింగ్ చేస్తారు? ఫామ్ విషయానికొస్తే ప్రస్తుతం విహారి మెరుగైన స్థితిలో ఉన్నాడు. వామప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 3, 4 స్థానాల్లో పుజారా, కోహ్లీకి పక్కనబెట్టే చాన్సే లేదు. టాప్–-4 వరకు నెట్టుకొచ్చినా.. పెద్ద సమస్య మిడిలార్డర్లోనే ఉంది.
రహానే, రోహిత్లో ఎవరు?
రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. ఆల్రౌండర్గా జడేజా ఏడో స్థానంలో రావడంతో కొంత సమతుల్యత వస్తుంది. ఎందుకంటే హార్దిక్ లేకపోవడంతో కచ్చితంగా ఆల్రౌండర్ ఉండాల్సిందే. ఈ వ్యూహానికి కోహ్లీ కట్టుబడితే.. మిడిల్కు బలమైన ఐదో స్థానంలో ఎవర్ని తీసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రహానె సూపర్ టెస్ట్ ప్లేయర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో రోహిత్ ఫామ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ ఇద్దరిలో ఒక్కరికే చాన్స్ ఇవ్వాల్సి వస్తే ఎవర్ని పక్కనబెడతారు? రోహిత్ ఆడిన చివరి టెస్ట్లో, ప్రాక్టీస్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో రహానె కొన్ని రన్స్ చేసినా.. కౌంటీల్లో హంప్షైర్ తరఫున పెద్దగా రాణించలేదు. అలాగని అతన్ని పక్కనబెట్టే సాహసం కోహ్లీ చేస్తాడా? టాప్ ఆర్డర్ విఫలమైతే ఇన్నింగ్స్ను పూర్తి స్థాయిలో చక్కదిద్దే ఓపిక, నైపుణ్యం, సాంకేతికత రహానె సొంతం. ఒకవేళ ఇద్దర్ని ఆడించాలంటే నలుగురు బౌలర్ల వ్యూహానికి కట్టుబడాలి. అంటే ముగ్గురు పేసర్లుగా బుమ్రా, షమీ, ఇషాంత్, ఏకైక స్పిన్నర్గా అశ్విన్ లేదా కుల్దీప్లో ఒకరికి చాన్స్ ఇవ్వాలి. కానీ విండీస్ పిచ్లపై ముగ్గురు పేసర్లు సరిపోతారా? ఈ స్ట్రాటజీ కాకుండా.. రోహిత్, రహానె రూపంలో ఎక్స్ట్రా బ్యాట్స్మన్ను తీసుకుంటే కచ్చితంగా జడేజాకు చాన్స్ ఉండదు. కానీ విండీస్ కండిషన్స్లో ఇది సూట్కాదు. ఎందుకంటే ముగ్గురు పేసర్లతో ప్రాపర్ ఓవర్ రేట్ను మెంటైన్ చేయడం అసాధ్యం. టెస్ట్లు గెలవాలంటే కచ్చితంగా ఐదుగురు బౌలర్లు ఉండాలని చెప్పే కోహ్లీ.. నాలుగో పేసర్గా ఉమేశ్ను తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నలుగురు బౌలర్లతోనే 20 వికెట్లు తీసే సత్తా టీమిండియాకు ఉందనుకున్నా.. టెస్ట్ చాంపియన్షిప్ తొలి మ్యాచ్లో కోహ్లీ ఆ ధైర్యం చేస్తాడా? చూడాలి.