- టామ్ కామ్ ద్వారా నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్
- ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని వెల్లడి
- మందమర్రిలో జర్మన్ భాష శిక్షణ కేంద్రం ప్రారంభం
కోల్ బెల్ట్, వెలుగు: జర్మనీలో ఏటా లక్షల ఉద్యోగ అవకాశాలున్నాయని, మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు ఆ దేశం సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, నైపుణ్యాభివృద్ధితోపాటు జర్మన్ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. జర్మనీ వీసాలో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు.
బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో టామ్కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్మన్ భాష శిక్షణా కేంద్రాన్ని మంత్రి వివేక్ ప్రారంభించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, సింగరేణి జీఎం రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో 4 నెలల్లో జర్మన్ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరని, జర్మనీలో పని చేయాలనుకునేవారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా ఏటా 25 వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. విదేశీ ఉద్యోగాలంటే అమెరికా, యూకేల్లో మాత్రమే కాదని, ఇంకా చాలా దేశాల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. జర్మనీలో వారానికి 32 నుంచి 35 గంటల పని మాత్రమే ఉంటుందని, మిగతా సమయాల్లో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
నెలకు రెండున్నర లక్షల వరకు ఆదాయం లభిస్తుందని చెప్పారు. మందమర్రిలో 112 మంది నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, వారందరికీ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు లభించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఇన్నోవేషన్తో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
కాకా వెంకటస్వామి ట్రస్ట్ ద్వారా స్టైఫండ్
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న స్టూడెంట్లకు ప్రభుత్వం నెలకు రూ. 2 వేలు స్టైఫండ్ ఇస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థుల్లో 80 శాతం హాజరున్న వారికి కాకా ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు రూ. వెయ్యి స్టైఫండ్ అందించి ప్రోత్సహిస్తామన్నారు. మందమర్రిలో ట్రైనింగ్సెంటర్కు ప్రతివారం తాను వచ్చి చూస్తానని, తానుకూడా జర్మన్ భాష నేర్చుకుంటానంటూ యూత్లో ఉత్సాహాన్ని నింపారు. సింగరేణి సంస్థ సహకారంతో చెన్నూరు సెగ్మెంట్లో నర్సింగ్ కాలేజీని పెడ్తామని, ఈ విషయాన్ని ఇదివరకే మంత్రి దామోదర దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
సింగరేణి యాజమాన్యం నర్సింగ్ కాలేజీకి అవసరమైన భవనాలను ఇవ్వాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణకు సూచించారు. జర్మన్ భాష శిక్షణలో బీ 2 సర్టిఫికేషన్ పూర్తిచేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమాకు మంత్రి వివేక్ ఆఫర్ లెటర్లు అందించారు. అంతకుముందు ఇల్లందు క్లబ్ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, సింగరేణి జీఎం రాధాకృష్ణ, టామ్కామ్ మేనేజర్ నాగభారతి, తహసీల్దార్ సతీశ్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, వరంగల్ రీజినల్ ఎంప్లాయిమెంట్ఆఫీసర్ రాము , మంచిర్యాల ఎంప్లాయిమెంట్ఆఫీసర్ రవికృష్ణతో కలిసి మంత్రి వివేక్ మొక్కలు నాటారు.
టెక్నాలజీలో తెలంగాణ పోలీసులు ఆదర్శం
టెక్నాలజీలో తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని, వీటివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుందని చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమారం, జైపూర్ మండలాల్లో, చెన్నూరులో మంత్రి వివేక్ పర్యటించారు. భీమారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తో కలిసి ప్రారంభించారు. అనంతరం చెన్నూరులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యతో కలిసి బస్తీ దవాఖానను, మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ వాహనాలను ప్రారంభించారు.
అంతకుముందు చెన్నూరులో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. భీమారం, జైపూర్, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అ తర్వాత మంత్రి ప్రజా పాలన– ప్రగతి నివేదన గ్రామ సభలో పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో వడ్ల కొనుగోలు పూర్తి చేశామన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు మంజూరు చేసిందని తెలిపారు.
కొత్తగా ప్రారంభించబోయే వందపడకల ఆసుపత్రికి 23 మంది డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయని, 10 పడకల ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెన్నూరు పట్టణంలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే చెన్నూరు ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఈ సందర్భంగా మంత్రిని రైతులు, మహిళా సంఘాల సభ్యులు శాలువాతో సత్కరించారు.
