హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో వొడాఫోన్ ఐడియా (వీ) తన 5జీ సేవలను ప్రారంభించింది. తిరుపతి, విశాఖపట్నంలలో విజయవంతంగా 5జీని ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్లో ఈ సేవలను విస్తరిస్తోంది. సిటీలోని ఐటీ కారిడార్లు, బిజినెస్ సెంటర్లు, జనాలు ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాలలో 5జీ మౌలిక సదుపాయాలను వీ ఏర్పాటు చేసింది. తమ వినియోగదారులు ఇక నుంచి అత్యంత వేగవంతమైన మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్, తక్కువ లేటెన్సీ, నమ్మకమైన కనెక్టివిటీని అనుభవించొచ్చని కంపెనీ పేర్కొంది.
గ్లోబల్ టెక్ దిగ్గజాలు, స్టార్టప్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీలకు) హబ్గా మారిన హైదరాబాద్లో 5జీ సేవలను విస్తరించడం కీలకమని వీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిజినెస్ హెడ్ రాహుల్ వహాల్ పేర్కొన్నారు. వినియోగదారుల డేటా అవసరాలకు అనుగుణంగా, దశలవారీగా మరిన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించడానికి కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు.
