
- నేను ఏ పార్టీకి మోసం చేయలేదు: సబితా ఇంద్రారెడ్డి
- మహిళలందరినీ సీఎం రేవంత్ అవమానించారు
- బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
- అవమానించి వెళ్లగొట్టారు: సునీతా లక్ష్మారెడ్డి
- ఆడ బిడ్డల ఉసురు తగుల్తది: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్పై కేటీఆర్ నిజాలు మాట్లాడుతుంటే.. దాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ఫైర్ అయ్యారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు.
‘‘మీ వెనుక కూర్చొన్న మహిళలు అంటూ.. సీఎం రేవంత్ మమ్మల్ని అవమానించారు. ఆయనకు మహిళలంటే ఎంత గౌరవమో దీన్ని బట్టే తెలుస్తున్నది. సునీతా లక్ష్మారెడ్డి, నా గురించి రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. పార్టీకి మేము మోసం చేశామని అంటున్నరు. కానీ, మేం ఏ పార్టీని మోసం చేయలేదు. సీఎం చేసిన కామెంట్లు మమ్మల్నే కాదు, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించినట్లు ఉన్నయ్. కాంగ్రెస్లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా? సీఎం స్థానాన్ని అగౌరవపర్చారు’’అని అన్నారు. ‘‘మమ్మల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే దిక్కని రేవంత్ అంటున్నరు.
ఆ మాటలు బాధ కలిగించాయి. మేము అక్కలుగా మీ మంచే కోరుకుంటాం’’అని అన్నారు. ‘‘నా కారణంగానే ఎల్వోపీ పోయిందన్నట్లు భట్టి విక్రమార్క అన్నరు. మరి సీఎంగా ఎందుకు మీరు ప్రయత్నించలేదు? ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని ఆయన అన్నరు. ఇది చాలా బాధ అనిపించింది. మేము ఏ తప్పు చేయలేదు’’ అని చెప్పారు.
ఏ పార్టీలో ఉన్నా సిన్సియర్గాపని చేసినం: సునీతా లక్ష్మారెడ్డి
అసెంబ్లీ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఏ పార్టీలో ఉన్నా.. సిన్సియర్గా పని చేశామని చెప్పారు. సబితా ఇంద్రారెడ్డితో కలిసి కాంగ్రెస్ జెండాలు మోసి కార్యకర్తలను కాపాడుకున్నామన్నారు.
‘‘మీరు ఏ పార్టీ నుంచి వచ్చారంటూ సీఎం అంటున్నరు.. ఆయన మాట్లాడే మాటలు.. దొంగలే.. దొంగ అన్నట్లు ఉన్నయ్. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నయ్.. మహిళలందరినీ రేవంత్ అవమానించారు. నన్ను, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణను కాంగ్రెస్ పార్టీలో అవమానించి వెల్లగొట్టారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి అసెంబ్లీకి వచ్చాం. సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చారో ప్రజలకు తెలుసు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. క్షమాపణ చెప్పాలి’’అని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
నిండు సభలో ఇద్దరు ఆడ బిడ్డలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇంత దారుణంగా ఎవరూ మాట్లాడరని విమర్శించారు. ‘‘అక్కలను నమ్ముకుంటే.. రేపు మీ బతుకు జూబ్లీ బస్టాండే అవుతదని రేవంత్ అనడం సరికాదు.
ఈ మాట తెలంగాణ ఆడ బిడ్డలందరికీ వర్తిస్తది. అందుకే నిండు సభలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సీఎం కుర్చిని అగౌరవపర్చారు. తెలంగాణ ఆడ బిడ్డల ఉసురు తగుల్తది. సునీతా, సబితా.. ఎంతో కష్టపడి గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేగా ఐదు సార్లు సబితా గెలిచారు. ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని భట్టి విక్రమార్క అనడం బాధాకరం’’అని అన్నారు.