ఇంగ్లండ్‌లో క్రికెట్ రీస్టార్ట్‌.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించిన ప్లేయర్స్

ఇంగ్లండ్‌లో క్రికెట్ రీస్టార్ట్‌.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించిన ప్లేయర్స్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల వచ్చిన లాంగ్ గ్యాప్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బ్రేక్ చేసింది. పలు జాగ్రత్తలు తీసుకుంటూ టీమ్ బట్లర్, టీమ్ స్టోక్స్ మధ్య మూడ్రోజుల ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించింది. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను నిర్వహించారు.

ఈ మ్యాచ్‌ మొదటి రోజు ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇన్నింగ్స్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. లాంగ్ గ్యాప్‌ తర్వాత కూడా అలుపెరగకుండా బౌలింగ్ చేసిన అండర్సన్.. బాల్‌ను ఎప్పటిలాగే ఇరు వైపులా స్వింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మధ్యలో అండర్సన్ శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ కనిపించాడు.

అలాగే వికెట్లు తీశాక హగ్స్, హైఫైస్‌తో కాకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మోచేతి విషెస్‌ చేస్తూ టీమ్‌మేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కూడా డ్రింక్స్‌ను గ్లవ్స్ వేసుకొని తీసుకువచ్చాడు. కరోనా వ్యాప్తి కారణంగా ఐసీసీ గైడ్‌లైన్స్‌ను ఇంగ్లండ్ క్రికెటర్లు స్ట్రిక్ట్‌గా పాటించడం గమనార్హం. గ్రౌండ్‌లో ఉన్న టైమ్‌లోనే గాక, ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ప్లేయర్లు, అంపైర్లను ఐసీసీ కోరింది.