
సాధించాలనే లక్ష్యం, సంకల్పం ఉంటే మహిళలు ఎక్కడైనా రాణించగలరని నిరూపించింది గిరిజన బిడ్డ సరిత. తెలంగాణ లో ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండా కు చెందిన వి.సరిత మిర్యాలగూడ డిపో లో jbm సంస్థ నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా విధుల్లో చేరారు.
సరిత హైదరాబాద్ టూ మిర్యాలగూడ బస్సును నడుపుతున్నారు. గతంలో ఢిల్లీ రవాణా సంస్థలో 10 సంవత్సరాలు డ్రైవర్ గా విధులు నిర్వహించారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలం లో డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో, jbm సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ గా నియమించేందుకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో తొలి మహిళా డ్రైవర్ గా తెలంగాణ ఆర్టీసీలో చేరింది డ్రైవర్ సరిత. తనకు అవకాశం ఇచ్చిన మంత్రి కి మహిళా డ్రైవర్ సరిత ధన్యవాదాలు తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోందని.. ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని మంత్రి పొన్నం చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు, తాజాగా ఆర్టీసీ లో మహిళా డ్రైవర్ గా అవకాశం ఇవ్వడం జరుగిందని తెలిపారు.
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ వి.సరిత ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.